UPDATED 16th JULY 2022 SATURDAY 01:10 PM
KA Pal Silent Protest : ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మౌన దీక్ష చేపట్టారు. తెలుగు రాష్ట్రాల విభజన హామీల అమలు కోసం ఢిల్లీ రాజ్ ఘాట్ లో మౌన దీక్ష చేస్తున్నారు. మద్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు కేఏ పాల్ మౌన దీక్ష చేయనున్నారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు అభివృద్ధి ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 8 ఏళ్లుగా విభజన హామీలను కేంద్రం, ప్రధాని మోడీ అమలు చేయడం లేదని విమర్శించారు. విభజన హామీలు అమలు కాలేదు కాబట్టి రాజ్ ఘాట్ లో మౌన దీక్ష చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జీవితంలో మొట్ట మొదటిసారిగా రాజ్ ఘాట్ లో మూడు గంటల పాటు మౌన దీక్ష చేస్తున్నానని తెలిపారు. తనతోపాటు మూడు గంటల పాటు దీక్ష చేయలేని వారు మూడు నిముషాలైనా దీక్ష పాటించండి అని పిలుపునిచ్చారు. ఈరోజు 2కోట్ల10 లక్షల మంది తనతో పాటు ఉపవాసం ఉంటున్నారని వెల్లడించారు. విభజన హామీల అమలు కోసం వచ్చే బుధవారం ఉదయం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతానని ప్రకటించారు.
విభజన హామీలు అమలు చేయకపోయే ఆగస్టు 15 తరువాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. తెలుగు సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావన్నారు. విభజన హామీల అమలు కోసం తనతో కలిసి రావాలని జగన్, కేసీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా అన్నిపార్టీల నేతలను కేఏ పాల్ బుధవారం దీక్షకు ఆహ్వానించారు.







