Rajinikanth : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం విజయవాడలో సూపర్ స్టార్.. బాలయ్యతో కలిసి రజినీ సందడి..

Updated 28th April 2023 Friday 10 25 am

Rajinikanth : తెలుగువారి గర్వకారణం, మహానుభావుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్(NTR) శత జయంతి వేడుకలు గత సంవత్సర కాలంగా ఎన్టీఆర్ అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం(Telugu Desham) పార్టీ, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ శత జయంతి ఉత్సవాలలో భాగంగా నేడు విజయవాడలో(Vijayawada) భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో సూపర్ స్టార్(Super Star) రజినీకాంత్(Rajinikanth) పాల్గొననున్నారని ఇటీవలే బాలకృష్ణ(Balakrishna) తెలిపారు.

నేడు ఏప్రిల్ 28 సాయంత్రం విజయవాడ పోరంకిలో ఉన్న అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శత దినోత్సవ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడకు చేరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజినీకాంత్ విజయవాడ వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో రజినీకాంత్ కి నందమూరి బాలకృష్ణ, టీడీ జనార్దన్, సావనీర్ కమిటీ ఘానా స్వాగతం పలికారు. బాలయ్యను చూడగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు రజనీకాంత్. ఎలా ఉన్నారంటూ పరస్పరం పలకరించుకున్నారు రజనీకాంత్-బాలయ్య. అనంతరం ఒకే కారులో నోవోటెల్ కు వెళ్లారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చినందుకు రజనీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు బాలయ్య. అన్నగారి కార్యక్రమానికి రాకుండా ఉండగలనా అంటూ వ్యాఖ్యానించారు రజనీకాంత్. రజనీకాంత్ తో హోటల్లో కాసేపు భేటీ అయ్యారు బాలయ్య. దీంతో గన్నవరం విమానాశ్రయం వద్దకు, నోవాటెల్ వద్దకు భారీగా సూపర్ స్టార్ అభిమానులు చేరుకున్నారు.

నేడు సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజినీకాంత్ కు తేనేటి విందు ఇవ్వనున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. అనంతరం అక్కడ్నుంచి పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సభకు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.

ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్య పరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన 2 పుస్తకాలను నేడు ఈ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ పై తొలి పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్టు ఎస్.వెంకటనారాయణ పాల్గొననున్నారు.

ఇక రజినీకాంత్ గతంలో 2004 కృష్ణానది పుష్కరాల సందర్భంలో విజయవాడకు వచ్చారు. 2004 తర్వాత మళ్లీ ఇప్పుడు విజయవాడకు రజనీకాంత్ రావడంతో భారీగా తలైవా అభిమానులు కూడా విజయవాడకు చేరుకుంటున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us