కాకినాడ (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: ఉద్యోగుల 71 డిమాండ్ల సాధన కోసమే ఉద్యమ బాట పట్టామని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తామని సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అది ఇప్పటికీ అమల్లోకి రాలేదు. 55 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. జులై 2018 నుంచి పెండింగ్ లో ఉన్న డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాం. 7 డీఏల్లో రెండు మాత్రమే ఇచ్చారు. మా డబ్బులు ఎప్పుడు వేస్తారు. నా సర్వీసు మొత్తంలో ఎప్పుడూ ఒకటో తేదీ జీతం వేయాలని డిమాండ్ చేసే పరిస్థితి లేదు... ఇప్పుడు వచ్చేలా ఉంది. కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులర్ చేస్తామన్న హామీ జాడలేదు. ప్రభుత్వాన్ని అడిగి.. అడిగి.. వేసారి గత్యంతరం లేక ఉద్యమానికి పిలుపునిచ్చాం. గ్రామ సచివాలయ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చెయ్యలేదు. ప్రభుత్వం ఉపా చట్టాలను ఉపయోగించినా ఉద్యమం ఆగదు’’ అని బండి శ్రీనివాస్ స్పష్టం చేశారు.







