UPDATED 31st AUGUST 2017 THURSDAY 10:00 PM
కాకినాడ : విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా కాకినాడ పోర్టు నుంచి విశాఖపట్టణం వరకు నేషనల్ హైవే 16ను కలుపుతూ నిర్మించదలచిన నాలుగు వరుసల తీర ప్రాంత రహదారి విస్తరణకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను వెంటనే సిద్ధం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ రూరల్ తిమ్మాపురం క్యాంఫ్ ఆఫీస్ లో రోడ్లు భవనాలు, రాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ అధికారులు, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో కలిసి నూతన బైపాస్ రోడ్డు వంతెన నిర్మాణాలపై మంత్రి యనమల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదనల ప్రకారం వాకలపూడి లైట్ హౌస్ నుంచి నేమాం వరకు నూతన బైపాస్ రోడ్డుకు, సముద్రతీరం వెంబడి 4.3 కిలోమీటర్ల ఆరు వరుసల రహదారి, వంతెన నిర్మాణం, ఉప్పాడ-అమీనాబాద్-కోనపాపపేట బైపాస్ రోడ్డు పనులకు భూమిని సేకరించాలని, దీనికోసం సంబంధిత గ్రామాల నుంచి భూమిని సేకరించే విషయంలో ప్రజల ఆస్తులకు ఎలాంటి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్అండ్బీ అధికారులకు మంత్రి సూచించారు. తొండంగి మండలం పెరుమాళ్లపురం జంక్షన్ కు బైపాస్ రోడ్డు నిర్మించడానికి ప్రతిపాదనలు పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ సి.ఎస్.ఎన్. మూర్తి, ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.







