UPDATED 19th JUNE 2017 MONDAY 2:00 PM
సామర్లకోట : రాష్ట్రంలో 2020 నాటికి అందరికి ఇళ్ళు నిర్మించాలనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తోందని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్యోజన పథకానికి స్థానిక గణపతినగర్లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్లో 1040 గృహాలు నిర్మించడం జరుగుతుందని, అలాగే జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాల్టీల్లో ఈ పథకం అమల్లోకి వస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈపథకం ద్వారా 7 వేలకుపైగా గృహాలకు అవకాశం లభిస్తుందన్నారు. జీప్లస్1 పద్ధతి ద్వారా అమలు జరుగుతుందని, రానున్నకాలంలో జీప్లస్2 పద్ధతికి ఆమోదం తెలిపే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ నిరుపేదల కలలను నిజం చేయడానికి ఈ పథకం ఎంతో ఉపయోగకరమన్నారు. అర్హులను ఎంపిక చేయడంలో నిబంధనలు పాటిస్తామన్నారు. కాలనీ ఏర్పడిన తరువాత అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఏడాదిన్నరలోపుఈపథకం పూర్తవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ మన్యం పద్మావతి, కాకినాడ ఆర్డీవో రఘుబాబు, తహసీల్దారు శివకుమార్, మున్సిపల్ వైస్ఛైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, మన్యం చంద్రరావు, అడబాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.







