Updated 8th May 2023 Monday 12:05 pm
Naga Babu Konidela : జనసేన అధికారంలోకి వస్తే ఏపీకి స్వర్ణయుగం మొదలవుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో నాగబాబు పాల్గొన్నారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ భవిష్యత్తు జనసేన గెలుపుతోనే ముడిపడి ఉందని నాగబాబు తేల్చి చెప్పారు. ప్రజలకు న్యాయంగా అందాల్సినవన్నీ జనసేన పాలనలో లభిస్తాయన్నారు. యువతకు బంగారు భవిష్యత్తు లభిస్తుందన్నారు. పవన్ కల్యాణ్ ను తమ్ముడిగా అభిమానిస్తాను, ఒక నాయకుడిగా ఆరాధిస్తాను అని నాగబాబు అన్నారు.
2019లో జనసేనకు 7శాతం ఓటింగ్ ఉంది. ఇప్పుడు 35 శాతంగా ఉంది. జనసేనలో అంతర్గత విభేదాలకు తావివ్వరాదు. పొత్తులపై కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. పొత్తు ఉందా? లేదా? ఒక్కరే పోటీ చేస్తారా? అవన్నీ మనకెందుకు. పవన్ కల్యాణ్ ఎన్ని సీట్లలో అభ్యర్థులను నిలుపుతారో అన్నింటిలో గెలిపించాలి. అది మన కార్యకర్తల డ్యూటీ. విశ్లేషణ వద్దు. ఓటు మనది, వ్యూహం పవన్ ది. మనందరికీ నచ్చిన విధంగానే పవన్ నిర్ణయం ఉంటుంది.
జనసేన అభ్యర్థులు నిలబడిన అన్ని సీట్లలో గెలుపే లక్ష్యంగా పని చేయాలి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేది గుర్తు పెట్టుకోవాలి. అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. పొత్తుల విషయంలో దయచేసి పవన్ కు సలహాలు ఇవ్వద్దు. మన లీడర్ ని మనం క్వశ్చన్ చేయకూడదు. మన నాయకుడు ఎప్పుడూ కరెక్టే. ఎవరూ చూడని విజన్ పవన్ కి చాలా ఎక్కువ ఉంది. మనలాంటోళ్లు పది అడుగులు ముందుకెళ్లి ఆలోచించగలరు. కానీ, పవన్ కల్యాణ్ వెయ్యి అడుగులు ముందుకెళ్లి ఆలోచించగలరు. అంత సమర్థవంతమైన నాయకుడు పవన్.
జనసేన అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ప్రతి భూకబ్జాను బయటకు తీస్తాం. జరిగిన నష్టాన్ని ముక్కుపిండి వసూలు చేస్తాము. ఆలయాల పవిత్రత, పరిరక్షణకు జనసేన ఎప్పుడూ ముందు ఉంటుంది. ప్రస్తుతం 80 నుంచి 90 శాతం మంది ఎమ్మెల్యేలు అవినీతిపరులే ఉన్నారు. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే అమలు చేసి ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారు. గంజాయ్ కేసులో పట్టుబడి యువత భవిష్యత్తు కోల్పోతున్నారు. వేలమంది జైళ్లలో మగ్గుతున్నారు” అని నాగబాబు అన్నారు.







