UPDATED 11th JULY 2022 MONDAY 08:30 PM
Revanth Reddy Challenge : ముందస్తు ఎన్నికల అంశం తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. అధికార, ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలకు సై అంటే సై అంటున్నాయి. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ముందస్తు ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఎన్నికలకు వెళ్దామన్నారు రేవంత్.
ఎన్నికలకు వస్తే బరిగీసి కొట్లాడుతామన్నారు రేవంత్ రెడ్డి.”ఎన్నికలు పెట్టాలని అనుకుంటే ప్రభుత్వాన్ని రద్దు చెయ్యి. ఇవాళ జులై 11. నాలుగు రోజుల సమయం ఇస్తున్నా. ఎవరికీ భయపడను తేల్చుకుంటాను అన్న కేసీఆర్.. నిఖార్సైన తెలంగాణ బిడ్డ అయితే, ఆయనలో పోరాట పటిమే ఉంటే, ఉద్యమకారుడివే అయితే.. నాలుగు రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి రా. ఎంత తొందరగా అయితే అంత తొందరగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకునేందుకు తెలంగాణ ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. ఉన్నపళంగా ఎన్నికలకు పోదాం.
నిబద్దత ఉంటే రా..” అంటూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.(Revanth Reddy Challenge)ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అన్నారు. కేసీఆర్ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సవాల్ చేయడం కాదు.. ముందు అసెంబ్లీ రద్దు చేయ్ అంటూ చాలెంజ్ విసిరారు. తక్షణమే అసెంబ్లీ రద్దు చేయాలని, శాసనసభ రద్దయితే ఆటోమేటిక్గా ఎన్నికలు వస్తాయని.. ఎన్నికలకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని, ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇదే అంశంపై బీజేపీ నేత బండి సంజయ్ కూడా స్పందించారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికల సవాల్ ను స్వీకరిస్తున్నామని తెలిపారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తంచేశారు. టీఆర్ఎస్లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారని.. అయినా.. కేసీఆర్ సర్కార్ను పడగొట్టే అవసరం తమకు లేదన్నారు.ఆదివారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. బీజేపీపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. అలా.. కేసీఆర్ నోట వచ్చిన ముందస్తు మాటతో.. రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ముందస్తు ఎన్నికల గురించి వాడీవేడిగా చర్చ నడుస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది.







