Gudivada Amarnath : అందుకే.. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేకపోయారు, సూపర్ స్టార్ అయితే ఏంటి?- మంత్రి గుడివాడ అమర్నాథ్

Updated 3rd May 2023 Wednesday 12:50 pm

Gudivada Amarnath : సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో ఇంకా రచ్చ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. రజనీకాంత్ టార్గెట్ గా వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రజనీకాంత్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్.. రజనీకాంత్ వ్యవహారంపై హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలు రజనీకాంత్ కు సారీ చెప్పాలన్న డిమాండ్ పై మంత్రి అమర్నాథ్ ఫైర్ అయ్యారు.

రజనీకాంత్ కు ఎవరూ సారీ చెప్పాల్సిన పని లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ తేల్చి చెప్పారు. రజనీ సినిమాల్లో సూపర్ స్టార్ అయితే ఎవరూ ఏమీ అనకూడదా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ని చంపిన వ్యక్తిని పొగిడితే నచ్చని వాళ్ళు కామెంట్ చేశారని చెప్పుకొచ్చారు. మా పార్టీ వాళ్ళు ఇచ్చిన కౌంటర్లలో తప్పు లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి మీదైనా తమ అభిప్రాయాలను చెప్పుకోవచ్చని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. విమర్శలు తట్టుకునే ధైర్యం లేకనే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లో రజనీకాంత్ రాలేకపోయారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.(Gudivada Amarnath)

హీరో రజనీకాంత్ కు ఎవరూ సారీ చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ వచ్చి ఎన్టీఆర్ గురించి మాట్లాడి వెళ్లిపోతే ఎవరూ ఏమీ మాట్లాడకపోయేవారు. కానీ, ఎన్టీఆర్ ను చంపిన వ్యక్తిని పొగిడితే సహజంగానే ఎవరైనా మాట్లాడతారు. సినిమాల్లో రజనీ సూపర్ స్టార్ కాబట్టి ఆయన్న ఎవరూ ఏమీ అనకూడదంటే రాజకీయాల్లో కుదరదు” అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తేల్చి చెప్పారు.

సీఎం జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రి వెల్లడించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో కీలక అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఆర్థిక ప్రగతిలో కీలకం కాబోతోందన్నారు. 190 కిమీ పొడవు తీరం ఉన్న శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో భాగంగా మూలపేట పోర్టు మంజూరు చేశారని చెప్పారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో మూలపేట పోర్టు నిర్మాణం ద్వారా శ్రీకాకుళం ముఖచిత్రం మారనుందన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్టు త్వరితగతిన పూర్తి చేయడానికి సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని మంత్రి చెప్పారు. 30 నెలల్లో డొమెస్టిక్ విమానాలు, ఆపై 4 నెలల్లో అంతర్జాతీయ విమానాలు భోగాపురం ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్నాయన్నారు. వైజాగ్ టెక్ పార్క్ ద్వారా డేటా సెంటర్ అందుబాటులోకి రానుందన్నారు. అదానీ డేటా సెంటర్ ద్వారా 14వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 14వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయన్నారు.

ఏపీలో 4 ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ద్వారా ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో అభివృద్ధి జరగనుందని మంత్రి చెప్పారు. రూ.6,500 కోట్లతో భోగాపురం, వైజాగ్ మధ్య 6 లైన్ల రోడ్డు నిర్మాణానికి కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఈ 6 లైన్ల రోడ్డు నిర్మాణం కోసం రూ.1200 కోట్లు ఏపీ వాటా కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us