UPDATED 3rd MARCH 2022 THURSDAY 02:00 PM
Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. రాజధాని అంశంపై వచ్చిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన హై కోర్ట్ త్రిసభ్య ధర్మాసనం.. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న ధర్మాసనం..ప్రభుత్వం ఆరు నెలల్లో ఆయా భూములను అభివృద్ధి చేయాలని సూచించింది. ఇక హై కోర్ట్ తీర్పుపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
విజయవాడలో బొత్స మీడియాతో మాట్లాడుతూ..కోర్టు తీర్పు ప్రభుత్వానికి షాక్ ఏమి కాదని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా చట్టాలు చేసే అధికారం శాసనసభకు, పార్లమెంటుకు ఉంటుందని ఆయన అన్నారు. బిల్లులను తాము ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు బొత్స తెలిపారు.
సీఆర్డీఏ బిల్లుని ఉపసంహరణ చేసి ఇప్పటికే అమలు చేస్తున్నమని మంత్రి తెలిపారు.ఇక మూడు నెలల్లో రాజధాని భూములు అభివృద్ధి చేసి ఇవ్వాలన్న కోర్టు ఆదేశాలపై మంత్రి స్పందిస్తూ.. ఫ్లాట్స్ మూడు నెలల్లో అభివృద్ధి చేసి ఇవ్వడం సాధ్యం అవుతుందా? అని సంశయించారు.
“చెప్పే వాడికి చేసే వాడు లోకువ అన్నట్లు ఉంది” అంటూ కోర్టు వ్యాఖ్యలపై పెదవి విరిచిన మంత్రి బొత్స..3 లేదా 6 నెలల్లో ప్రారంభించాలి అని చెప్తే బాగుంటుందని అన్నారు. చట్టాలను తాము రద్దు చేసుకుంటే కొత్తగా తీర్పు ఏముందని మంత్రి బొత్స అన్నారు. టీడీపీకి సమాజ అభివృద్ధి కంటే సామాజిక అభివృద్ధి కావాలని, టీడీపీ నేతలేమి సాధువులు కాదని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.







