UPDATED 19th FEBRUARY 2022 SATURDAY 01:10 PM
Kasireddy Rajendranath Reddy : ఆంధ్రప్రదేశ్ డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ దగ్గరి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు సీనియర్ ఐపీఎస్ అధికారులు. ఈ సందర్భంగా మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. దిశ యాప్ డౌన్ లోడ్స్ 1,10,00,446 జరిగినట్లు, ఏపీ సేవా ద్వారా ఎఫ్ఐఆర్ లు 40 వేలకు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారనే విషయాన్ని చెప్పారు. ఏపీ కాప్స్, ఏపీ పోలీస్ యాప్ లు అంతర్గత నిర్వహణకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళల, ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారం త్వరితగతిన జరిగేలా చూసేందుకు ఓ టెక్నాలజీని రూపొందించామన్నారు. పోలీసు స్టేషన్లు అన్నీ హైస్పీడ్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయ్యాయని, పాస్పోర్ట్ తనిఖీలో ఏపీ మొదటి స్ధానంలో ఉందన్నారు. ఏపీ పోలీసు శాఖకు మొత్తం 150 జాతీయ అవార్డులు వచ్చినట్లు, శాఖలో పనిచేస్తున్న పోలీసులకు ప్రభుత్వం వీక్లీ ఆఫ్ ఇచ్చిందన్నారు.
ఇన్సూరెన్స్ కూడా పలు బ్యాంకుల నుంచీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోనా కష్టకాలంలో పోలీసులు ఎనలేని సేవలు చేశారని, వారి సేవలు మరువరావన్నారు. ఇక రాష్ట్రంలో గంజాయిని అణిచివేసేందుకు కఠినంగా వ్యవహరించామని, అందులో భాగంగా 7552 ఎకరాలలో గంజాయి సాగు నాశనం చేశామన్నారు. 47988 కేజీల గంజాయి ఇతర రాష్ట్రాల నుంచీ వస్తే సీజ్ చేసినట్లు, రాజేంద్రనాధ్ రెడ్డి చాలా నిబద్ధత కలిగిన అధికారి అని ప్రశంసించారు. డీజీపీగా రాజేంద్రనాధ్ రెడ్డి బాధ్యతలను నిర్వర్తిస్తారు.. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నట్లు మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం.. కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కొత్త డీజీపీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీపీఎస్సీ (APPSC) చైర్మన్గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పదవిలో గౌతమ్ సవాంగ్ ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా ఉద్యోగ ప్రస్థానాన్ని సవాంగ్ ప్రారంభించారు. తర్వాత చిత్తూరు, వరంగల్ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. 2001-2003 సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. హోంగార్డు విభాగం డీఐజీగానూ సేవలందించారు.
2003-2004 వరకూ ఎస్ఐబీ డీఐజీగా, 2004-2005 మధ్య ఏపీఎస్పీ పటాలం డీఐజీగా సవాంగ్ పనిచేశారు. 2005-2008 వరకూ సీఆర్పీఎఫ్ డీఐజీగా, 2008-2009 మధ్య శాంతిభద్రతల విభాగం ఐజీగా పనిచేశారు. ఆ తర్వాత డిప్యుటేషన్పై మూడేళ్ల పాటు లైబీరియాలో ఐక్యరాజ్యసమితి పోలీసు కమిషనర్గా వ్యవహరించారు. 2015-2018 మధ్య విజయవాడ పోలీసు కమిషనర్గా పనిచేశారు. గతేడాది జులై నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గౌతమ్ సవాంగ్కు డీజీపీగా బాధ్యతలు అప్పగించారు.







