జైపూర్ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: జీవితంలో మధురఘట్టమైన పెళ్లివేడుక నాడు విశాల హృదయం చాటింది ఆ అమ్మాయి. తన కుమార్తె ఆశయాన్ని తీర్చి.. ఆ వేడుకను అందంగా మలిచాడు ఆ తండ్రి. ఆ వేడుక రోజున ఆ తండ్రీకూతుళ్లు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని బార్మర్ నగరానికి చెందిన కిశోర్ సింగ్ కనోడ్ కుమార్తె అంజలీ కన్వార్ను ప్రవీణ్ సింగ్కు ఇచ్చి వివాహం చేశారు. ఈ వేడుక నవంబర్ 21న జరిగింది. కుమార్తెను అత్తింటికి పంపేప్పుడు పుట్టింటి నుంచి రూ.75 లక్షలు కానుకగా ఇవ్వాలని కనోడ్ ముందుగానే ఆ మొత్తాన్ని పక్కన పెట్టుకున్నారు. అయితే పెళ్లికి ముందే అంజలీ తన తండ్రి వద్దకు వెళ్లి తన మనసులో మాటను బయటపెట్టింది. తన కోసం కేటాయించిన ఆ సొమ్మును బాలికల విద్యను ప్రోత్సహించేందుకు వెచ్చించాలని కోరింది. వారి కోసం వసతి గృహం కట్టించేందుకు ఇవ్వాలని అడిగింది. తన కుమార్తె తపనను అర్థం చేసుకున్న ఆ తండ్రి సంతోషంగా ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించి.. ఆమె చేతిలో బ్లాంక్ చెక్ పెట్టారు. ఎంత డబ్బు కావాలో దాంట్లో రాసుకోమని ప్రోత్సహించారు.
మరో విషయం ఏంటంటే కనోడ్ గతంలోనే ఓ హాస్టల్ నిర్మాణానికి కోటి రూపాయాలను విరాళంగా ఇచ్చారు. అయితే దాని నిర్మాణం పూర్తి కావాలంటే మరో రూ.50 నుంచి రూ.75 లక్షలు అవసరం కానున్నాయి. ఆ డబ్బునే ఇప్పుడు ఆయన కుమార్తె సమకూర్చింది. ఈ తండ్రీకూతుళ్లు కలిసి బాలికల విద్యకోసం చూపిన చొరవను ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు. కన్యాదానం వేళ..ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని అభినందిస్తున్నారు.







