UPDATED 11th JUNE 2022 SATURDAY 04:20 PM
Somu Veerraju : ఏపీలో బీజేపీ జనసేనల పొత్తుపై ఆసక్తికర చర్చలు జరుగుతన్నాయి. జనసేన పార్టీ నేతలు ఒకరకంగా వ్యాఖ్యానిస్తుంటే బీజేపీ నాయకుల వ్యాఖ్యలు మరోరకంగా ఉంటున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల నేపధ్యంలో ఈ రోజు ఆత్మకూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ….పొత్తుల విషయమై నాదెండ్ల మనోహర్తో టచ్లో ఉన్నామని తెలిపారు. జనసేనకు చెందిన బొల్లిశెట్టి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యాలపై మాట్లాడాల్సిన పనిలేదని ఆయన తేల్చి చెప్పారు. వైసీపీలో ఉండే వాళ్లంతా వెర్రిపుష్పాలే అని వీర్రాజు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా చెప్పుకొని స్టిక్కర్లు వేసుకుంటూ రాష్ట్రంలోని వైయస్సార్ సీపి ప్రభుత్వం స్టిక్కర్ల ప్రభుత్వం గా మారిందని ఎద్దేవా చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం పథకాన్ని రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం 16,600 రూపాయలు మద్దతు ధర ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లను ఉసిగొల్పి వారి ద్వారా 13,300 రూపాయలు రైతులకు ఇచ్చి దోపిడీ చేస్తోందని ఆయన అన్నారు.







