కాకినాడ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: కలెక్టరేట్లో వికాస ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు వందల సంఖ్యలో నిరుద్యోగులు తరలిరావడంతో కోలాహలం నెలకొంది. పీజీ, డిగ్రీ, బీటెక్, డిప్లమో ఉత్తీర్ణులైన అభ్యర్థులను అర్హులుగా నిర్ణయించారు. 970 మంది ఉద్యోగార్థులు రావడంతో ముఖాముఖికి ఏర్పాట్లు చేయలేక సతమతమయ్యారు. ఉన్నతాధికారుల అనుమతితో విధాన గౌతమి సమావేశ మందిరం, బెన్నెట్ క్లబ్, వికాస కార్యాలయం వద్ద ముఖాముఖికి ఏర్పాట్లు చేశారు. ప్రాథమికంగా 475 మందిని ఎంపిక చేశామని, మళ్లీ ఇంటర్వ్యూ ఉంటుందని వికాస పీడీ కె.లచ్చారావు చెప్పారు.
30న జిల్లా ఉపాధి కార్యాలయంలో..
జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30న ఉద్యోగ మేళా నిర్వహిస్తామని జిల్లా ఉపాధి అధికారిణి కె.శాంతి తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మేళా ప్రారంభమవుతుందన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, బీజడ్సీ, ఫార్మసీ, డిప్లొమో మెకానికల్, ఇంటర్, పదో తరగతి తదితర విద్యార్హతలు గల యువతీ, యువకులు హాజరు కావచ్చన్నారు. ఉద్యోగాల స్థాయి ఆధారంగా వేతనం రూ.13 వేల నుంచి రూ.17వేల వరకు ఉంటుందని వివరించారు.







