అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: రవాణాశాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్య కారణంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడ్డారు. జనవరి 1 నుంచి రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరగనున్నాయి. ఈనేపథ్యంలో.. అంతకు ముందే వాహనాలు కొనేందుకు వాహనదారులు ప్రయత్నిస్తున్నారు. వాహనం డెలివరీ చేయకపోవడంతో పలు చోట్ల వినియోగదారులు డీలర్లతో వాగ్వాదానికి దిగారు. దీనిపై రవాణాశాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. రవాణాశాఖ వెబ్సైట్ సర్వర్లు పనిచేయకపోవడం వల్లే పౌరసేవలు తాత్కాలికంగా స్తంభించాయని, పునరుద్ధరణకు నిపుణులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ప్రజలు, వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వాహనదారులు ఇప్పుడు కొనుగోలు చేసిన వాహనాలకు జనవరి 1 తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నా.. ప్రస్తుత పన్నులనే చెల్లించేలా అవకాశం కల్పించినట్టు తెలిపారు. దీనికోసం జనవరి 1కి ముందు వాహనం కొనుగోలు చేసినట్టు తగిన ధృవపత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు. ఈ ఆదేశాన్ని ఇప్పటికే వివిధ జిల్లాల రవాణాశాఖ అధికారులు, డీలర్లకు తెలిజేసినట్టు మంత్రి వెల్లడించారు. వాహనదారులు ఆందోళన చెందవద్దని కోరారు.







