UPDATED 28th AUGUST 2022 SUNDAY 07:30 PM
CM KCR: దేశంలో రైతాంగ సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమ పంథాకు పార్లమెంటరీ పంథాను సమన్వయం చేసి జమిలి పోరాటాలు సాగించడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. జాతీయ రైతు సంఘాల నేతలతో హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఆదివారం కేసీఆర్ సమావేశమయ్యారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల సందర్భంగా రైతాంగ సమస్యల పరిష్కారం, ఇతర అంశాలపై చర్చించారు. భారత దేశ రైతాంగాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే దిశగా చర్యలు ప్రారంభించాలని సూచించారు.
‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుసరించిన జమిలి పంథానే దేశ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అనుసరించాలి. అప్పుడే గమ్యాన్ని చేరుకోగలం. దేశ వ్యతిరేకులతో నాడు ‘జై తెలంగాణ’ అనిపించినట్లే, నేడు రైతు వ్యతిరేకులతో ‘జై కిసాన్’ అనిపించాలి. ఆ దిశగా దేశంలోని రైతు నేతలంతా ప్రతినబూనాలి. ఈ దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం. రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగుపడుతుంది. దేశంలో దశాబ్దాల నుంచి రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు వజ్రోత్సవ భారతంలో కూడా పరిష్కారం దొరకకపోవడం విచారకరం’’ అని కేసీఆర్ అన్నారు.మరోవైపు.. దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచి ఏకం చేసేందుకు నాయకత్వం వహించాలని సమావేశానికి హాజరైన రైతు సంఘం నేతలు కేసీఆర్ను కోరినట్లు సమాచారం.
త్వరలోనే పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ఉద్యమానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని నేతలు తీర్మానించారు.







