అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : గుంటూరులోని జిన్నా టవర్ చుట్టూ అధికారులు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. జిన్నా టవర్ పేరు మార్చాలని, లేకపోతే కూల్చివేస్తామని ఇటీవల బీజేపీ నేతలు ప్రకటించడం సంచలనమైంది. దీని పై బీజేపీ నేతలు, అధికార పార్టీ నేతలకు మధ్య రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. దీంతో గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు ఇటీవల అధికారులతో కలిసి జిన్నా టవర్ ను సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా టవర్ వద్ద రక్షణ ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు జిన్నా టవర్ చుట్టూ ఫెన్సింగ్ కోసం ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రస్తుతం పిల్లర్లు పూర్తయ్యాయి. త్వరలోనే ముళ్ల కంచె ఏర్పాటు చేయనున్నారు. ఎవరూ టవర్ వద్దకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. టవర్ వద్ద నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.







