Updated 1st January 2023 Sunday 7:40 pm
Stampede In Guntur: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభలో మరోసారి కలకలం చెలరేగింది. చీరలు పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరి కొందరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరి పేర్లు రమాదేవి, అసియాగా గుర్తించినట్లు అధికారులు చెప్పారు. మరొకరి పేరు తెలియాల్సి ఉంది. ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట చోటుచేసుకుని ఎనిమిది మంది మృతి చెందిన ఘటన మరవకముందే ఇప్పుడు మరోసారి అటువంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం.
ఇవాళ గుంటూరు జిల్లా వికాస్ నగర్ లో ఇవాళ చంద్రబాబు సభ నిర్వహించారు. ఈ సభ నుంచి చంద్రబాబు నాయుడు వెళ్లిన అనంతరం టీడీపీ నేతలు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మహిళలు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
గాయపడ్డ మహిళలకు ప్రాథమిక చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు. కొందరిని పోలీసులు కాపాడినట్లు తెలుస్తోంది. కానుకలు ఇస్తారని వస్తే తమ కుటుంబాల్లో పెను విషాదం మిగిలిందని పలువురు మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.







