ముంబయి (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: బలవంతపు వసూళ్లకు సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్పై మరిన్ని సంచలన ఆరోపణలు వస్తున్నాయి. 13ఏళ్ల క్రితం ముంబయి నగరంపై దాడికి పాల్పడిన పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ను పరంబీర్ సింగ్ ధ్వంసం చేశారని విశ్రాంత అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సంషేర్ ఖాన్ పఠాన్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడుల తర్వాత కసబ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ను అప్పటి సీనియర్ ఇన్స్పెక్టర్ ఎన్.ఆర్ మాలి.. కాంబ్లీ అనే కానిస్టేబుల్కు ఇచ్చినట్లు సంషేర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉగ్రదాడి సమయంలో టెర్రరిస్టు నిరోధక దళ డీఐజీగా ఉన్న పరంబీర్ ఆ ఫోన్ను కానిస్టేబుల్ నుంచి తీసుకున్నారని.. అయితే దాన్ని అప్పటి దర్యాప్తు అధికారి రమేశ్ మహాలేకు ఇవ్వకుండా పరంబీర్ ధ్వంసం చేశారని సంషేర్ ఆరోపించారు.







