UPDATED 12th NOVEMBER 2022 SATURDAY 7:15 PM
CM Jagan: ఎనిమిదేళ్లనాటి రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కేంద్రం ప్రకటించినట్లు ప్రత్యేకహోదాతోపాటు విభజన హామీలను అమలు చేయాలని ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాతోపాటు పలు అంశాల్ని ప్రధాని ముందు ప్రస్తావించారు.
శనివారం ఏపీ, విశాఖపట్నం, ఏయూ ప్రాంగణంలో ప్రధాని మోదీతో కలిసి సీఎం జగన్ భారీ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సభలో మోదీ సమక్షంలో జగన్ మాట్లాడారు. ఏపీకి సంబంధించిన పలు అంశాల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ఈ మూడున్నరేళ్లలో ఏపీ సంక్షేమం, అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతం. రాష్ట్రాభివృద్ధికి మీ సహాయసహకారాలు అవసరం. ఎనిమిదేళ్లనాటి విభజన గాయం నుంచి ఇంకా ఏపీ కోలుకోలేదు.
విభజన హామీలైన పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, విశాఖ స్టీల్ప్లాంట్ నుంచి ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలని కోరుతున్నాం. పెద్దలు.. సహృదయులు మీరు (ప్రధానిని ఉద్దేశించి) మమ్మల్ని ఆశీర్వదించాలి. ఏపీని తగిన విధంగా కేంద్రం ఆదుకోవాలి. మా సమస్యల్ని పరిష్కరించాలని మరోసారి కోరుతున్నాం’’ అని జగన్ ప్రసంగించారు.







