అన్నవరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: అన్నవరం సత్యదేవుని క్షేత్ర పాలకులు సీతారాముల వారికి దేవస్థానం వ్రత పురోహితులు ప్రయాగ వెంకటరమణ, ఎం.శ్రీరామచంద్రమూర్తిల బృందం వెండి పాదుకలు, గొడుగు, వింజామర అందించారు. సుమారు 94 గ్రాముల వెండితో చేయించిన వీటిని ఈవో త్రినాథరావుకు గురువారం అందించారు. ఈ నెల 27న సత్యదీక్షలు విరమణ ఉంటుందని అధికారులు తెలిపారు. సత్యదేవుని జన్మనక్షత్రం మఖ పర్వదినం రోజున దీక్ష విరమణ సందర్భంగా తెల్లవారుజామున 1 నుంచి 2 గంటల వరకు మహన్యాసం, 3 గంటల నుంచి 4.30 గంటల వరకు పంచామృతాభిషేకాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం దీక్ష విరమణ ఉంటుందన్నారు. దేవస్థానంలో గురువారం 3,170 వ్రతాలు జరిగాయి. వ్రతాలు, కల్యాణాలు, ప్రసాద విక్రయాలు, దర్శనాలు, పూజలు తదితర వాటి ద్వారా రూ.31.70 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.







