నల్గొండ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: ఏడాదిన్నరలో నల్గొండ ఐటీ హబ్ని ప్రారంభించి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నల్గొండలో ఐటీ హబ్కు ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో భూమిపూజ చేశారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 75వేల చదరపు అడుగుల్లో 750మంది కూర్చొనేలా నిర్మించబోయే ఐటీ హబ్ ద్వారా 15 కంపెనీలు 1600 ఉద్యోగాలు కల్పించనున్నట్టు చెప్పారు. ‘‘ఖమ్మం, కరీంనగర్లో ఐటీ హబ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఉగాదిలోపు నిజామాబాద్లో ప్రారంభం కాబోతోంది. అతి త్వరలో మహబూబ్నగర్లో ప్రారంభం కాబోతున్నది. రాబోయే 16-18 నెలల్లో నల్గొండలో కూడా మళ్లీ మేమే వస్తాం.. ఐటీ హబ్ని ప్రారంభిస్తాం. కొత్తగా పేద ప్రజల కోసం నల్గొండ పట్టణంలో ఐదు బస్తీ దావాఖానాలను ఈరోజే మంజూరు చేస్తున్నాం. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్కు కూడా రూ.4.5కోట్లతో ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఆధునికమైన రెండు వైకుంఠ ధామాలకు రూ.మూడు కోట్లతో పనులు మొదలుపెట్టాలని ఈరోజే ఆదేశిస్తున్నాం. మున్ముందు రోడ్లు, జంక్షన్లను సుందరీకరించి నల్గొండ ముఖచిత్రాన్ని మార్చే బాధ్యత మాది’’ అని కేటీఆర్ అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.







