అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : నియోజకవర్గంలో పార్టీ నాయకులు పనిచేయకుంటే మార్పు తప్పదని.. పార్టీ ఎవరి కోసం త్యాగాలు చేయదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. పనిచేయని ఇన్ఛార్జిలను పక్కన పెట్టేస్తామని హెచ్చరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జగన్ అడిగిన ఒక్క అవకాశం ప్రజలిచ్చారు.. కానీ, ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సంక్షేమం కింద ఇచ్చే దానికంటే ప్రజలపై మోపే భారం 3రెట్లు ఎక్కువ ఉందన్నారు. ఆదాయం, ఖర్చును ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని వివరించారు. వివిధ సంస్థల విశ్వసనీయత, బ్రాండ్ ఇమేజ్ను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు భువనేశ్వర్ నుంచి విశాఖకు వలస వచ్చేవారు.. ఇప్పుడు రాష్ట్రం నుంచి భువనేశ్వర్కు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితం.. దానిపై స్పందించనని చంద్రబాబు తెలిపారు. కరోనా కారణంగా జనం రోడ్డెక్కలేదని, దీంతో జగన్ బతికిపోయాడని హెచ్చరించారు. 175 నియోజకవర్గాల నేతలతో సమావేశమై ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామన్నారు. ఏసీబీ, సీఐడీలను కంట్రోల్లో పెట్టుకుని అందరినీ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. గౌరవానికి భంగం కలుగుతుందని భయపడి సైలెంటుగా ఉంటున్నారని, మరి కొందరు గొడవలెందుకని.. ఇంకొందరు వలస పోతున్నారన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం తాను కూడా విన్నానని చెప్పారు. తెలంగాణతో పాటు ముందుగా ఎన్నికలకు వెళ్తారని ప్రచారం జరుగుతోందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.







