Updated 28 January 2022 Friday 07:10 AM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) : దేశంలోని పట్టణ ప్రాంత పేద ప్రజల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరిగా జాతీయ పట్టణ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ విషయమై కేంద్రానికి ఆయన లేఖ రాశారు. దేశంలో పట్టణీకరణ భారీ ఎత్తున పెరుగుతున్నదని.. దీంతో పట్టణ పేదరికం కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. పట్టణాలకు వచ్చే పేద ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం వారి ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.
పట్టణ పేద ప్రజలు కనీస అవసరాలను అందుకునేలా వారికి ఉపాధి హామీ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరే పట్టణల్లోనూ ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని ఈ బడ్జెట్లో కేంద్రం ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు గతంలో పార్లమెంటరీ స్థాయి సంఘంతో పాటు సీఐఐ వంటి సంస్థలు ఇచ్చిన సిఫార్సులను కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటికే 30 శాతానికి పైగా దేశ ప్రజలు పట్టణాల్లో నివాసం ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. పట్టణ పేదల కోసం ఈ బడ్జెట్లో ఈ ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టాలని కేంద్రాన్ని కేటీఆర్ కోరారు. ఈ మేరకు పట్టణీకరణ, పట్టణ పేదరికం, పట్టణ పేదల జీవితాల్లో సానుకూల మార్పులకు తీసుకోవాల్సిన చర్యల వంటి అంశాల పైన కేంద్రానికి కేటీఆర్ కీలక సూచనలు చేశారు.







