UPDATED 7th JULY 2022 THURSDAY 11:15 AM
Paruveta Utsavam : తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వేంచేసి యున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం బుధవారం శ్రీవారి మెట్టు సమీపంలో వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది.
అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు.ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెం ప్రయోగించారు. ఆస్థానం అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







