UPDATED 16TH MAY 2017 TUESDAY 6:00 PM
కాకినాడ : డెంగీ, మలేరియాపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కాకినాడ కలెక్టరేట్ కోర్ట్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, నిల్వనీటిలో దోమలు ఉంటాయని ఈ దోమల కారణంగానే డెంగీ సంభవిస్తుందన్నారు. జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి పీఎస్ఎన్ ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డెంగీ నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. గత ఏడాది జిల్లాలో 336 డెంగీ కేసులు నమోదు కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. వ్యాధి నివారణ కోసం వర్షాలు పడక ముందే జూన్ నెలలో గ్రామాల్లో సర్వే చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. దోమల నిర్మూలన కోసం డ్రైనేజీలు, నిల్వనీటి ఆవాసాలపై యాంటీలార్వా స్ప్రే చేయించాలన్నారు. డెంగీ నివారణ కోసం పైరీత్రమ్ మందు చల్లడం, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. గ్రామసభల్లో డెంగీ, మలేరియాపై అవగాహన కల్పించాలని డీపీఓను ఆదేశించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా శక్తి సంఘ సభ్యులు, పింఛన్దారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కాకినాడ ,రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రులలో డెంగీ మందులు, ప్లేట్లెట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కో–ఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కిషోర్, డీఎంహెచ్ఓ డాక్టర్ చంద్రయ్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, జిల్లా మలేరియా అధికారి పీఎస్ఎన్ ప్రసాద్, జెడ్పీ సీఈవో పద్మ, డీఆర్డీఏ పీడీ మల్లిబాబు పాల్గొన్నారు.







