UPDATED 9th SEPTEMBER 2022 FRIDAY 02:30 PM
Amaravati Farmers: ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి రైతుల మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ నెల 12 నుంచి నవంబర్ 11 వరకు, దాదాపు రెండు నెలలపాటు ఈ యాత్ర సాగుతుంది.
అమరావతి నుంచి అరసవిల్లి వరకు అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు ఈ యాత్ర చేపట్టనున్నారు. యాత్ర విషయంలో ప్రభుత్వ అభ్యంతరాల్ని కోర్టు కొట్టిపారేసింది. పాదయాత్ర చేపట్టేందుకు రైతులు దరఖాస్తు చేసుకోగా, ఏపీ డీజీపీ అనుమతి నిరాకరించారు. దీంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. యాత్ర చేసుకునేందుకు అంగీకరించింది.
మహాపాదయాత్రలో 600 మంది పాల్గొనేందుకు హైకోర్టు అనుమతించింది. పాదయాత్ర తర్వాత మహాసభ కోసం కూడా ముందే అనుమతి తీసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులకు అనుమతిస్తారు? రైతుల యాత్రకు అనుమతివ్వరా? వేర్వేరు రాష్ట్రాల మీదుగా సాగుతున్న భారత్ జోడో యాత్రకు కూడా అనుమతించారు కదా! ఢిల్లీలో వేలాదిమంది రైతులు ర్యాలీలు చేస్తున్నారు. ఢిల్లీలో లేని శాంతి భద్రతల సమస్య ఇక్కడే వస్తుందా?’ అంటూ హై కోర్టు ప్రశ్నించింది. యాత్ర కోసం ఈ రోజే పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పాదయాత్రకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.







