ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధాని కృషి చేస్తున్నారని కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళ పరుస్తోందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. రబీ సీజనులో ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా అంగీకరించాం. అదనంగా 20లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకునేందుకు ఒప్పందం జరిగింది. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చాం. ఒప్పందం ప్రకారం ఇవ్వా్ల్సిన ధాన్యాన్ని తెలంగాణ ఇవ్వలేదు. నాలుగు సార్లు గడువు కూడా పొడిగించాం. దేశంలో ఉప్పుడు బియ్యాన్ని చాలా తక్కువగా తింటారు. రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామని ఏడాది క్రితమే చెప్పాం. ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని సేకరించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రా రైస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే మొత్తం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని పీయూష్ గోయల్ అన్నారు.







