రేణిగుంట (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: అమరావతి ఐకాస ఆధ్వర్యంలో రేపు నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తిరుపతి బైపాస్ మార్గంలో టయోటా షోరూం సమీపంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సభా ప్రాంగణంలో భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఒక్కరోజే సమయం ఉండటంతో త్వరగా పనులు పూర్తిచేస్తున్నారు. ఐకాస నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, పువ్వాడ సుధాకర్, రాయపాటి శైలజ, తెదేపా నేత పులివర్తి నాని తదితరులు భూమిపూజలో పాల్గొన్నారు. తిరుపతిలో నిర్వహించనున్న బహిరంగ సభకు తొలుత ఏపీ ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో అమరావతి ఐకాస నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చంటూ అనుమతి ఇచ్చింది. హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచే సభ నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలపై ఐకాస నేతలు దృష్టి సారించారు.







