UPDATED 8th SEPTEMBER 2022 THURSDAY 08:00 PM
Kanipakam : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం టిటిడి తరఫున ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, కాణిపాకంలో గురువారం శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి తిరుకల్యాణం సందర్భంగా టిటిడి తరఫున పట్టువస్త్రాలు సమర్పించినట్టు తెలిపారు. ప్రతి ఏడాదీ బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని శ్రీ వినాయకస్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈవోకు పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ ఎం.ఎస్.బాబు, ఆలయ బోర్డు ఛైర్మన్ శ్రీ మోహన్రెడ్డి, ఈవో శ్రీ సురేష్బాబు, సర్పంచ్ శ్రీమతి శాంతిసాగర్రెడ్డి, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పార్పత్తేదార్ శ్రీ ఉమామహేశ్వర్రెడ్డి, వేదపారాయణదారులు పాల్గొన్నారు.







