UPDATED 12th APRIL 2022 TUESDAY 02:40 PM
Yadagirigutta : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం భవిష్యత్ లో అత్యద్భుత దివ్యక్షేత్రం గా పేరుగాంచనుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. ఈ రోజు ఆయన యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.ఏకాదశి మంగళవారం పవిత్ర దినాన స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
రాజుల కాలంలో ఇలాంటి నిర్మాణాలు చూశామని.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైందని స్వరూపానందేంద్ర వారు అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటిగా యాదగిరిగుట్ట ఆలయం విలసిల్లనుందని స్వామి అన్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, ఈవో గీత పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
గర్భగుడిలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయం నిర్మాణాలను కూడా స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పరీశీలించారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత స్వామి వారిని దర్శించుకున్న మొట్ట మొదటి పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు మాత్రమే. ఆయన వెంట ఉత్తరపీఠాధిపతి స్వాత్మానందేంద్ర కూడా ఉన్నారు.







