UPDATED 15th APRIL 2022 FRIDAY 07:50 PM
Vundavalli On CM Jagan : ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ పాలనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ను బిజినెస్ మ్యాన్ గా అభివర్ణించిన ఆయన.. జగన్ పెద్ద గ్యాంబ్లింగ్ ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో క్విడ్ ప్రోకోను అమలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్.. ఒకపక్క డబ్బులు ఇస్తూ.. మరోవైపు పన్నుల రూపంలో లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. రేపు జనాల ఒంటి మీదున్న బట్టలు కూడా తీసేస్తాడేమో? అనే అనుమానం వ్యక్తం చేశారాయన. విద్యుత్ పై జగన్ కి ముందు చూపు లేదన్నారు ఉండవల్లి.
ఇంతకు ముందు రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదన్నారు. తెలంగాణలో పవర్ కట్ లేదని గుర్తు చేసిన ఆయన.. ఏపీలో మాత్రం కరెంట్ కట్ విపరీతంగా ఉందన్నారు. విద్యుత్ కష్టాల నుంచి బయట పడేందుకు ఎన్ని యుగాలు పడుతుందో తెలియదన్నారు. జగన్ ఎంత కాలం బటన్స్ నొక్కి డబ్బులు ఇవ్వగలడో అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. జగన్ చేస్తుంది తప్పు అని చెప్పే వాళ్లు ఎవరు లేరన్న ఉండవల్లి.. జగన్ ఎవరి మాటా వినరని చెప్పారు. ఏపీలో ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ లేదన్నారు. వైసీపీలో ఉన్న నేతలందరూ నాకు స్నేహితులే అన్నారు ఉండవల్లి.(Vundavalli On CM Jagan)
”ఎన్నికల ముందు చంద్రబాబు రూ.10 వేలు పంచినా ఓట్లు రాలేదు. డబ్బులు పంచుతున్నాను కదా? తనకే ఓటు వేస్తారని జగన్ అనుకుంటున్నారు. రాష్ట్రంపై శుక్రుడు వక్రంగా చూస్తున్నాడు. శుక్రుడు ఎవరో నన్ను అడగొద్దు. తెలంగాణ రిచ్ స్టేట్ గా.. ఏపీ పూర్ స్టేట్ గా తయారైంది. ప్రధాని మోదీకి జగన్ ఇచ్చిన వినతి పత్రంలో ప్రత్యేక హోదా అంశమే లేదు” అని ఉండవల్లి అన్నారు.
”హిందువులు అభద్రతా భావానికి గురికావడం ప్రమాదకరం. ఇది మంచి పద్ధతి కాదు. అన్ని అబద్దాలే ప్రచారం చేస్తున్నారు. ఇది దేశానికి ప్రయోజనం కాదు. ఇది ఒక రాజకీయ పార్టీ చేస్తోంది. దాని పేరు చెప్పను. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటివి చేస్తున్నారు.
జిన్నా టవర్ అసలు ఇష్యూనే కానే కాదు. నేను పెద్ద హిందూవును. హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాలు ధ్వంసం విషయంలో పార్టీలు కలగజేసుకోకుండా ఉంటే తప్పు చేసిన వారిని ఒక కానిస్టేబుల్ పట్టుకుంటారు. ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు కుదరవు. విభజన హామీలు గురించి వైసీపీ ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గే అవకాశం ఉంది. కేంద్రం ఏపీకి డబ్బులు ఇవ్వడం లేదు. మన ఎంపీలు నోరు మెదపడం లేదు. జగన్ పాదయాత్ర నడిచిందే.. ప్రత్యేక హోదా కోసం. కానీ ముఖ్యమంత్రి అయ్యాక దానిని పక్కన పెట్టారు. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుంది. పాలన విషయంలో రాజశేఖర్ రెడ్డికి జగన్ కి పోలికే లేదు’ అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.(Vundavalli On CM Jagan)
సీఎం జగన్ తీరు, పాలన గురించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఉండవల్లి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.







