UPDATED 17th JULY 2022 SUNDAY 09:40 PM
TTD : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం నాడు సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగాలను సూచిస్తూ శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హనుమంతుని ప్రతిమలను పల్లకీపై కొలువుదీర్చారు. 5 రకాల సంప్రదాయ పుష్పాలు, 5 రకాల కట్ ఫ్లవర్స్ కలిపి మొత్తం ఒక టన్ను పుష్పాలు వినియోగించారు.
ఈరోడ్ కు చెందిన దాత సహకారంతో పల్లకీ పుష్పాలంకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శ్రీ శేఖర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్బాబు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, విజిఓ శ్రీ బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.







