హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: జీఎస్టీ కౌన్సిల్ కేంద్రం ఇటీవల వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని 7 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని మంత్రి కేటీఆర్ కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు. దేశచరిత్రలో ఏనాడూ చేనేత ఉత్పత్తులపైన పన్నులేదని, కేంద్రం జీఎస్టీ ద్వారా మొదటి సారి 5 శాతం విధించిందని గుర్తుచేశారు. అప్పుడే చేనేత రంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. తాజాగా ఇప్పుడున్న 5 శాతానికి మరో 7 శాతం కలిపి 12 శాతం జీఎస్టీ విధించారని తెలిపారు. చేనేత, వస్త్ర పరిశ్రమపై జనవరి ఒకటి నుంచి జీఎస్టీ పన్ను పెంపు అమలు చేయకుండా కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కరోనా ప్రభావంతో టెక్స్టైల్, చేనేత రంగాలు రెండేళ్లుగా తీవ్ర సంక్షోభంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 5 శాతం నుంచి 12 శాతానికి అంటే మరో ఏడు శాతం అదనంగా పెంచడం పరిశ్రమను చావుదెబ్బతీయడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించేది టెక్స్టైల్, చేనేత పరిశ్రమలని.. ఈ పరిస్థితుల్లో అదనపు ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన చేనేత చీరలకు ప్రసిద్ధిగాంచిందన్నారు. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపుపై వస్త్ర వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. 2017 మే 18న జీఎస్టీ కౌన్సిల్ చేనేత ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు లేకుండా ఉండాలని తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఒక వేళ జీఎస్టీ పెంపు ప్రతిపాదనను విరమించుకోకుండా ముందుకు వెళ్లాలనుకుంటే చేనేత, పవర్లూమ్ వ్యాపారులకు ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ బేస్ జీఎస్టీ మినహాయింపును రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచాలని, తద్వారా లక్షలాదిమంది చేనేత వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.







