UPDATED 26th OCTOBER 2022 WEDNESDAY 05:20 PM
Modi Visakha Tour : ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారైంది. నవంబర్ 11న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. విశాఖలో 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రైల్వే స్టేషన్ నవీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన మరికొన్ని కార్యక్రమాలకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ.
అదే రోజున ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనపై ఏపీ ప్రభుత్వానికి, రైల్వే అధికారులకు పీఎంవో సమాచారం ఇచ్చింది. అదే రోజున ప్రధానితో భోగాపురం ఎయిర్ పోర్టు, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయించే విధంగా ఇప్పటికే పీఎంఓకు ప్రతిపాదనలు పంపింది ఏపీ ప్రభుత్వం.సీఎం జగన్ తో పాటుగా గవర్నర్ బిశ్వభూషణ్ ప్రధాని పర్యటనలో పాల్గొనున్నారు.
ప్రధాని మోదీ బహిరంగ సభ కోసం ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాట్లు చేయనున్నారు అధికారులు. ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు ప్రధాని విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధాని విశాఖ టూర్ రోజున నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నాయి.







