Updated 12th June 2023 Monday 9:30 pm
East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నల్లజర్ల మండలం అనంతపల్లి శివారులో ఈ ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వేగంగా దూసుకెళ్లిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్లో పెళ్లికి హాజరై తమ స్వస్థలం రాజమహేంద్రవరంలోని ప్రకాశ్నగర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఎనిమిది నెలల బాలుడితో పాటు మరొకరు ఉన్నారు. మృతులను సత్తిబాబు, రవితేజ, శ్రావణికుమారి, అరుణగా గుర్తించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కొవ్వూరు డీఎస్పీ వర్మ తెలిపారు.







