UPDATED 30th JULY 2019 TUESDAY 5:30 PM
రాజానగరం: భారతదేశ ఆర్ధిక వ్యవస్థలో భీమా రంగం పాత్ర అనే అంశంపై స్థానిక గైట్ డిగ్రీ కళాశాల కామర్స్, మేనేజ్ మెంట్ విభాగం అధ్యాపకులు డాక్టర్ జి. చంద్రయ్య నిర్వహణలో ఒకరోజు అవగాహనా సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి ఏవో సిహెచ్ తాతారావు మాట్లాడుతూ దేశంలో జీవిత భీమా సంస్థ అత్యధికంగా 74 శాతం భీమా వ్యాపారం చేస్తుండగా, మిగిలిన 13 సంస్థలు 26 శాతం వ్యాపారం చేస్తున్నాయని, పెట్టుబడి రూపకల్పన, ఉద్యోగాల కల్పనలో భీమా రంగం ప్రధాన పాత్ర వహిస్తుందని అన్నారు. భీమా సంస్థలు పొదుపును సమీకరించి వాటిని ఉత్పాదక కార్యక్రమాలకు పెట్టుబడిగా పెడతాయని, తద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. రాజమహేంద్రవరం ఇన్సూరెన్స్ ఇనిస్టిట్యూట్ గౌరవ కార్యదర్శి మెండు కోదండరాం మాట్లాడుతూ భీమా రంగంలో ఉద్యోగాలు పొందేందుకు తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు ఇన్సూరెన్స్ ఇండియా ద్వారా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గైట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె. వల్లీ మాధవి మాట్లాడుతూ ప్రజల ఆర్థికాభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధికి భీమా వ్యవస్థ దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గైట్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు జి. చంద్రయ్య, వెంకట్, హైమావతి, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







