Updated 3rd February 2023 Friday 2:10 pm
Jagananna Videshi Vidya deevena : ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభమైంది. ఇవాళ సీఎం జగన్ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ఉచిత విదేశీ విద్య అందించనున్నారు. అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయం చేయనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.19.95 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు సాయం అందనుంది. మిగిలిన విద్యార్థులకు కోటి రూపాయల వరకు ట్యూషన్ ఫీజు 100 శాతం రీయింబర్స్ మెంట్ సాయం ఇవ్వనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ఏడాది టాప్ 20 విదేశీ యూనివర్సిటీల్లో 213 మందికి అడ్మిషన్లు రానున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల వారికి మంచి జరగాలని ఆకాంక్షించారు.
జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని అభివర్ణించారు. పేద విద్యార్థులు ప్రపంచంలోనే టాప్ వర్సిటీల్లో చదువుకునే అవకాశం లభిస్తుందన్నారు. చదువుకు పేదరికం అడ్డు రాకూడదని చెప్పారు. పిల్లలకు చదువే మనమిచ్చే ఆస్తి అని అన్నారు. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని కోరారు. ప్రపంచ వేదికపై దేశం, ఏపీ జెండా ఎగర వేయాలన్నారు.







