UPDATED 4th MARCH 2018 SUNDAY 8:00 PM
సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన కుమారారామ భీమశ్వర స్వామి ఆలయంలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం భీమేశ్వరాలయస్వామి దేవాలయ ఆవరణలో రూ. కోటి టూరిజం శాఖ నిధులతో నిర్మించే డార్మెటరీకి ఆదివారం ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ ఈ క్షేత్రానికి ఎంతో ప్రత్యేకత ఉందని, ఇక్కడి స్వామివారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు. భక్తులు సౌకర్యార్థం టూరిజం శాఖ నిధులుతో వసతి గదులు, లాకర్లు, రెండు వీఐపీ ఘాట్లు నిర్మించనున్నట్టు తెలిపారు. అనంతరం స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ కంటే జగదీష్మోహన్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ట్రస్టుబోర్డు సభ్యులు మహంకాళి వెంకట గణేష్, దూది రాజు, పడాల వీరబాబు,గొల్లపల్లి కామరాజు, బాడితమాని త్రిమూర్తులు, టూరిజం శాఖ ఆర్డీ భీమశంకరం, ఆలయ ఈవో పులి నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.







