Updated 10th March 2023 Friday 12:20 am
Nandyala Tiger Issue : 92 గంటల ప్రయత్నం ఫలించలేదు. పేగు బంధం తెగిపోయింది. తల్లికి శాశ్వతంగా దూరమైపోయాయి నాలుగు పులి కూనలు. నంద్యాల జిల్లా పెద్దగుమ్మాడపురంలో ఆపరేషన్ మదర్ టైగర్ ముగిసింది. ఫారెస్ట్ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా T-108 పులి ఆచూకీ చిక్కలేదు. దీంతో 4 పులి కూనలను తిరుపతి జూకి తరలించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ అర్థరాత్రికే తిరుపతి శ్రీ వేంకటేశ్వర జూ పార్కుకి తరలించనున్నారు. 4 రోజుల పాటు అన్వేషించినా.. తల్లి పులి జాడ దొరకలేదు.
తల్లి నుంచి విడిపోయి దారితప్పిన నాలుగు పెద్ద పులి పిల్లలు గ్రామంలోకి వచ్చేసిన ఘటన నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామ శివారులో జరిగింది. పులి పిల్లలను గమనించిన గ్రామస్తులు షాక్ అయ్యారు. ఆ తర్వాత.. కుక్కలు ఎక్కడ దాడి చేసి చంపుతాయోనని పులి పిల్లలను గ్రామస్తులు తీసుకెళ్లి ఓ గదిలో సేఫ్ గా ఉంచారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులి పిల్లలను పరిశీలించారు. పులి కూనలన్నీ ఆడవేనని, ఒకేసారి నాలుగు ఆడ పిల్లలకు జన్మనివ్వడం అరుదని అధికారులు తెలిపారు.
కాగి, పులి కూనలను.. వాటి తల్లి పులితో కలపడానికి అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం లేకపోయింది. తల్లి పులి కోసం అటవీ శాఖ అధికారులు తీవ్రంగా శ్రమించినా నిరాశే ఎదురైంది.







