ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: దేశంలో బూస్టర్ డోసుపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. వేర్వేరు వ్యాక్సిన్లను కలిపి బూస్టర్ డోస్ సిద్ధం చేసే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. అయితే, కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి కొవొవాక్స్ను బూస్టర్ డోసుగా ఇస్తే సత్ఫలితాలు ఉంటాయని వైరాలజిస్ట్, ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సర్టియాకు మాజీ ముఖ్య సలహాదారు డాక్టర్ షాహిద్ జమీల్ వెల్లడించారు. ‘‘ప్రస్తుతం భారత ప్రభుత్వం ఆమోదించిన వ్యాక్సిన్లకు సంబంధించిన డేటా విశ్లేషణ ప్రకారం.. కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న ప్రజలు కొవొవాక్స్ను బూస్టర్ డోసుగా తీసుకోవడం ద్వారా కరోనా మహమ్మారి నుంచి రక్షణ లభిస్తుంది’’అని డాక్టర్ జమీల్ తెలిపారు. కొవొవాక్స్ వ్యాక్సిన్ను అమెరికాకు చెందిన నొవావాక్స్ సంస్థ తయారు చేస్తోంది. తాజాగా ఈ వ్యాక్సిన్ను భారత్లో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) అభివృద్ధి చేసి.. విక్రయించేందుకు అనుమతులు లభించాయి. దీంతో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించి.. దేశవ్యాప్తంగా పంపిణీతోపాటు 7 కోట్ల కొవొవాక్స్ డోసులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు సీరం సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. మరో వైరాలజిస్ట్ గగన్దీప్ కంగ్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొవిషీల్డ్ వ్యాక్సినేషన్ పూర్తయిన వారు బూస్టర్ డోసుగా మూడోసారి కొవిషీల్డ్ వ్యాక్సిన్ లేదా కొవొవాక్స్ వ్యాక్సిన్ వేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతోందని తెలిపారు. కొవొవాక్స్తో మెరుగైన ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. యూకేలో నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు.







