Updated 23rd February 2023 Thursday 5:10 pm
Chandrababu slams Jagan: ఆంధ్రప్రదేశ్ లో మధ్యంతర ఎన్నికలకు ముఖ్యమంత్రి జగన్ సిద్ధమవుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చట్ట ప్రకారం పనిచేస్తే సమాజంలో గుర్తింపు వస్తుందని, అయితే, జగన్ మాత్రం ఎన్నికల్లో డబ్బులతో గెలుస్తామన్న ధీమాకు వచ్చారని చెప్పారు. ఇవాళ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని, భయపడకూడదని చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రజలను చైతన్యం చేసే దిశగా ముందుకు వెళ్తానని, రాష్ట్రాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ కోసం అధికారులు బలి పశువులు కావద్దని చంద్రబాబు నాయుడు సూచించారు.
పోలీసులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఐపీసీ చట్టం కాకుండా వైసీపీ చట్టం ఉందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో అధికారానికి అడ్డు వచ్చినందుకే వివేకా హత్య జరిగిందని, బాబాయినే చంపిన వ్యక్తి వల్ల రాష్ట్ర ప్రజలకు రక్షణ ఎలా లభిస్తుందని చంద్రబాబు ప్రశ్నించారు.







