Updated 24th April 2017 Monday 1:30 PM
పెద్దాపురం: రోజు రోజుకూ పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ చలివేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పెద్దాపురం ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు కోరారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఎపి రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్, పెద్దాపురం డివిజన్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎపి రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్, పెద్దాపురం డివిజన్ అధ్యక్షుడు టి.ఏ. కృష్ణారావు మాట్లాడుతూ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం వేసవి కాలం చివరి వరకు కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి. శ్రీనివాస్, ఆర్డీవో కార్యాలయ సిసి జి. రాజశేఖర్, రెవిన్యూ అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం. విజయ్ కుమార్ , భానుకుమార్, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.







