UPDATED 31St OCTOBER 2022 MONDAY 01:20 PM
Question paper leak case: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రాష్ట్ర మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణ బెయిల్ రద్దు అయింది. నవంబర్ 30లోగా లొంగిపోవాలని ఆయనను చిత్తూరు కోర్టు ఆదేశించింది. పదవ తరగతి ప్రశ్న పత్రాలు లీకేజీ కేసులో పోలీసులు అరెస్టు చేసిన నారాయణకు గతంలో చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు కోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పిటిషన్ దాఖలు చేశారు.
వాదనలు విన్న తర్వాత ఇవాళ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. కాగా, ఏపీలో ఈ ఏడాది నిర్వహించిన పదో తరగతి పరీక్షల ప్రశ్న పత్రాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణపై కేసు నమోదైంది. ఈ కసులో గతంలో పోలీసులు నారాయణను అరెస్టు చేశారు.
నెల్లేపల్లి కేంద్రంగా ఈ ఏడాది ఏప్రిల్ 27న తెలుగు ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీసు వ్యవహారంలో ఆయనను హైదరాబాద్లో అరెస్టు చేసినట్లు అప్పట్లో చిత్తూరు పోలీసులు వివరించారు. అప్పట్లో ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూప్లో కనపడింది. ఈ ఘటనలో నారాయణతో పాటు డీన్ బాల గంగాధర్ పాత్ర ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.







