తిరుమల (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: తిరుమల శ్రీవారి దర్శనానికి నవంబరు 18 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు కలిగిన భక్తులు తమ దర్శన తేదీని రీషెడ్యూల్ చేసుకునే సదుపాయాన్ని కల్పించామని తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఆయా తేదీల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేకపోయినవారు ఆరునెలల్లోపు దర్శన స్లాట్లను రీషెడ్యూల్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు.
లింకురోడ్డు మీదుగా తిరుమలకు వాహనాలు
అలిపిరి-తిరుమల రెండోఘాట్ను మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేసి శనివారం నుంచి లింకు రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలను అనుమతించనున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మొదటి ఘాట్రోడ్డు నుంచే వాహనాల రాకపోకలు సాగుతున్నందున అలిపిరి, లింకు బస్టాండ్, తిరుమలలో భక్తులు గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. వీరి ఇబ్బందులను తొలగించడానికి లింకురోడ్డు మీదుగా తిరుమలకు వాహనాలను అనుమతించనున్నట్లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన రెండో ఘాట్రోడ్డును, రక్షణ గోడల పునర్నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఘాట్రోడ్డులో ఇటీవల విరిగిపడిన భారీ కొండచరియలోని మిగిలిన సగభాగం రోడ్డుమీద పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా శాశ్వత చర్యలపై దృష్టిపెట్టాలని సూచించారు.







