UPDATED 24th MARCH 2022 THURSDAY 07:00 PM
Andhra Pradesh 3 Capital : ఏపీ రాజధాని అంశంపై తగ్గేదే లేదంటున్నారు సీఎం జగన్. అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నట్లు, రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాజధాని నిర్ణయం తమదే అని ఎక్కడా కేంద్రం చెప్పలేదని.. రాష్ట్రానిదే తుది నిర్ణయమని అఫిడవిట్ కూడా ఫైల్ చేసిందన్నారు.
న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ మూడు పిల్లర్లు… ఏ వ్యవస్థ అయినా తమ పరిధిలో పనిచేస్తేనే… మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. లేనిపక్షంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయన్నారు. మంచి చట్టాలు చేస్తే ప్రజలు ఆదరిస్తారు..లేకపోతే ప్రజలు వ్యతిరేకిస్తారన్నారు. మూడు రాజధానులు, CRDA చట్టాల విషయంలో తాము వెనక్కి తీసుకుంటే… దానిపై తీర్పు ఇవ్వడం ఏంటీ అని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీలో రాజధానిపై హైకోర్టు తీర్పు, 3 రాజధానుల అంశంపై సీఎం జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు.
శాసనసభ అధికారాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నట్లు, ఇప్పుడు ప్రశ్నించకపోతే శాసన వ్యవస్థకే ఇబ్బంది వస్తుందన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి తమపై ఉందని, రైతుల ప్రయోజనాలు కాపాడుతామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. అమరావతిని నెల రోజుల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు చెప్పిందని..ఆచరణకు సాధ్యం కాని విధంగా ఆదేశాలు ఉండొదన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు హైకోర్టు ఆదేశాలు విరుద్ధమని, వికేంద్రీకరణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అసెంబ్లీ సాక్షిగా కుండబద్ధలు కొట్టారు. వికేంద్రీకరణ అంటే.. అందరి అభివృద్ధి అన్నారు.
పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తెస్తామని ప్రకటించారు. రాజధాని ప్రాంతానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడడం జరుగుతుందని, అందరికీ మంచి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన సీఎం జగన్.. రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఉందన్నారు. వికేంద్రీకరణ బాటలో సాగటం మినహా మరో మార్గం లేదని స్పస్టం చేశారాయన. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ సలహా తీసుకోవడం జరుగుతోందని, రాజధాని ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదని..పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని కేంద్రం చెప్పిందని సీఎం జగన్ శాసనసభలో వెల్లడించారు.







