Updated 2nd April 2023 Sunday 9:10 am
Pawan Kalyan : టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జల్సా సినిమాతో మొదలైన వీరిద్దరి స్నేహం.. సినిమాలు ధాటి వ్యక్తిగతంగా కూడా మంచి మిత్రులు అయ్యిపోయారు. ప్రస్తుతం పవన్ సినిమా వ్యవహారాలు కూడా దాదాపు త్రివిక్రమే చూసుకుంటున్నాడు. కాగా వీరిద్దరి స్నేహం గురించి త్రివిక్రమ్ సతీమణి సౌజన్య శ్రీనివాస్ (Soujanya Srinivas).. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.
పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వస్తే మావారు, ఆయన కబుర్లలో మునిగిపోతారు. ఎక్కువుగా తత్వశాస్త్రం, పురాణాల గురించే మాట్లాడుకుంటుంటారు. ఆ మాటల్లో పడి చుట్టూ ఏమి జరుగుతుందన్న విషయానే మర్చిపోతారు. వారిద్దరి మధ్య చాలా గొప్ప స్నేహమే ఉంది. ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉంది. మావారు తన పుస్తకాలను ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడరు, కానీ కళ్యాణ్ గారు అడిగితే మాత్రం కాదనకుండా ఇచ్చేస్తారు. వాళ్లిద్దరూ ఒకరికి ఒకరు ఇచ్చుకునే బహుమతులు ఏమన్నా ఉన్నాయి అంటే అవి పుస్తకాలు, పెన్నులే.
ఇక పవన్ కళ్యాణ్ గారికి మా ఇంటి వంట అంటే చాలా ఇష్టం. ఉదయం సమయంలో వస్తే ఉప్మా అడిగి మరీ చేయించుకుంటారు. మధ్యాహ్న భోజనంలో అయితే వెజిటేరియన్ వంటలు, ఆవకాయ ఇష్టంగా తింటారు. అలాగే ఊరగాయలు, రవ్వలడ్డూలు అడిగి మరీ తింటారు. అడగడానికి అస్సలు సిగ్గుపడరు. మా ఇంటిలో మనిషిలా కలిసిపోతారు అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈమె మంచి క్లాసికల్ డాన్సర్ పలు స్టేజీల్లో పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. ఇటీవలే నిర్మాతగా మారి బుట్టబొమ్మ, సార్ సినిమాలు నిర్మించింది. ఈ రెండు చిత్రాలను తానే కథ విని ఒకే చేసినట్లు చెప్పుకొచ్చింది.







