Updated 15th May 2023 Monday 9:20 am
Nara Lokesh Padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సోమవారం నాటికి 100వ రోజుకు చేరింది. నంద్యాల జిల్లా (Nandyala District) శ్రీశైలం నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సాగుతుంది. 100వ రోజు పాదయాత్రలో నారా లోకేశ్.. బోయరేవుల క్యాంప్సైట్ నుంచి బండిఆత్మకూరు శివారు విడిది కేంద్రం వరకు దాదాపు 12కి.మీ మేర పాదయాత్రలో పాల్గొంటారు. మోతుకూరులో 100రోజుల పాదయాత్ర పైలాన్ ఆవిష్కరణ చేస్తారు. ఇప్పటి వరకు 34 నియోజకవర్గాల్లో 1268.9 కి.మీ మేర లోకేశ్ యువగళం పాదయాత్ర (Lokesh Yuvagalam Padayatra) సాగింది.
పాదయాత్ర సాగిందిలా..
వందరోజుల సుదీర్ఘ పాదయాత్రలో 32 బహిరంగసభలు, వివిధవర్గాలతో 87ముఖాముఖి కార్యక్రమాలు, హలో లోకేష్ పేరిట నాలుగు ప్రత్యేక కార్యక్రమాల్లో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 45రోజులు సాగిన పాదయాత్ర అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 23 రోజులు సాగింది. ఆ తరువాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. ఈ జిల్లాలో ఇప్పటి వరకు 11నియోజకవర్గాల్లో 32 రోజులు యువగళం పాదయాత్ర సాగింది. ప్రస్తుతం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర సాగుతుంది.
1900 వినతులు..
ఇదిలాఉంటే.. 100రోజుల పాదయాత్రలో యువనేత నారా లోకేశ్కు రాతపూర్వకంగా 1900 వినతిపత్రాలు అందాయి. ప్రతీ 100కిలో మీటర్లకు ఆ ప్రాంత సమస్యలపై ఒక స్పష్టమైన హామీని లోకేశ్ ఇస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీ నెరవేరుస్తానంటూ ఇప్పటి వరకు 12శిలాఫలకాలను లోకేశ్ ఆవిష్కరించారు.
పాదయాత్రలో పాల్గోనున్న లోకేశ్ తల్లి..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువతనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం పాదయాత్రలో నారా లోకేశ్ తల్లి నారా భువనేశ్వరి పాల్గోనున్నారు. లోకేశ్తో కలిసి యువగళం పాదయాత్రలో ఆమె కొంచెం దూరం నడవనున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, లోకేశ్ చిన్ననాటి స్నేహితులుకూడా 100వ రోజు యువగళం పాదయాత్రలో పాల్గోనున్నారు.







