Janasena : అనంతకు జనసేనాని.. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. లక్ష

UPDATED 12 APRIL 2022 TUESDAY 07:00 AM

Pawan Kalyan Visit Anantapur : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు జనసేనాని తలపెట్టిన రైతు భరోసా యాత్రను 2022, ఏప్రిల్ 12వ తేదీ మంగళవారం ప్రారంభించనున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

ఉదయం కొత్తచెరువు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించి ఆర్ధిక సాయం అందించనున్నారు. అనంతరం కొత్త చెరువు నుంచి ఉదయం 10.30గంటలకు బయలుదేరి ధర్మవరానికి చేరుకొని మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించనున్నారు. 11.20 గంటలకు ధర్మవరం నుంచి గొట్లూరుకి చేరుకొని.. మరో రైతు కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి 12.10 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేయనున్నారు పవన్. జిల్లాలోని పర్యటనలో చివరిగా అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ గ్రామంలో ఇద్దరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేసి.. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2011లో అప్పటి ప్రభుత్వం కౌలు రైతుల ఆత్మహత్యల నివారణ కోసం తీసుకువచ్చిన చట్టం ప్రకారం ఏడు లక్షలు ఇవ్వాలని నాదెండ్ల మనోహర్‌ డిమాండ్ చేశారు.

జనసేన తరఫున రాష్ట్రంలోని వెయ్యి మంది కౌలు రైతు కుటుంబాలను ఆదుకోనున్నట్లు నాదెండ్ల చెప్పారు.ఇటీవలే పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఉగాది పర్వదినాన పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలవాలని జనసేనాని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పార్టీ తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.

ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వారి పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ ప్రకటించారు. అంతేకాదు త్వరలోనే ప్రతి కుటుంబాన్నీ తానే స్వయంగా పరామర్శిస్తానని చెప్పారు. కౌలు రైతులు సాగు చేసుకుంటే రుణం ఇవ్వరు, నష్టపోతే పరిహారం కూడా ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.

గత ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఆకర్షణీయ హామీలిచ్చిన పవన్.. ఇప్పుడు నేరుగా కౌలు రైతుల ఇళ్లకు వెళ్లి ఆర్ధికసాయం అందిస్తామని ప్రకటించడం ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us