UPDATED 3rd NOVEMBER 2022 THURSDAY 4:20 PM
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి.. సినీరంగంలో రచయతగా మొదలయిన ఇతని కెరీర్, ఆ తరువాత దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఎన్నో సేవలు అందించాడు. రచయతగా దాదాపు 150 పైగా సినిమాలకు పనిచేసిన పోసాని, తను రాసిన డైలాగ్స్ తో ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. బోయపాటి శ్రీను, కొరటాల శివ వంటి అగ్ర దర్శకులు పోసాని దగ్గర శిష్యురికం చేశారు.
ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ.. తన నటనా శైలితో ఆకట్టుకుంటున్న ఈ నటుడు రాజకీయ రంగంలోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు. 2009 ఎన్నికలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పోటీ చేసిన పోసాని.. ఎలక్షన్ లో ఓడిపోయాడు. ఇక అప్పటి నుంచి ఏపీ పాలిటిక్స్ లో పరోక్షంగా ఉంటూ రాగా, 2019 ఎన్నికలో వైస్సార్సీపీ పార్టీలో చేరాడు. నాటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ వస్తున్న పోసానికి ఏపీ ప్రభుతం ఒక కీలక పదవిని అప్పగించింది.
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పోసాని కృష్ణమురళిని నియమిస్తూ జగన్ సర్కార్ నేడు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదవిలో పోసాని రెండేళ్లు కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీకి కూడా ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి మనకి తెలిసిందే.







