Updated 9th February 2023 Thursday 7:30 pm
Andhra Pradesh: దేశంలో కఠిక పేదరికానికి నిదర్శనంగా నిలిచే ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. వివిధ కారణాలతో మరణించిన కుటుంబ సభ్యుల మృతదేహాల్ని స్వస్థలాలకు తరలించేందుకు కూడా డబ్బులు లేక, భుజాలపైనో, ద్విచక్ర వాహనాలపైనో మోసుకెళ్తున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి.
తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఏపీలో జరిగింది. ఒక వ్యక్తి ఆటోకు డబ్బులు లేక తన భార్య మృతదేహాన్ని భుజాలపైనే మోసుకెళ్లాడు. అయితే, అది చూసి కొందరు మానవత్వంతో స్పందించి, సాయపడ్డారు. ఒడిశాకు చెందిన సాములు అను వ్యక్తి, అనారోగ్యంతో ఉన్న తన భార్య గురును ఇటీవల విశాఖపట్నం పరిధిలోని, సంగివలస ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ చికిత్సకు స్పందించకపోవడంతో, వైద్యుల సూచన మేరకు ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లాలని నిర్ణయించాడు. దీంతో తీవ్ర విషమంగా ఉన్న ఆమెను ఆటోలో స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. రూ.2,000 చెల్లించి ఒక ఆటోను మాట్లాడుకున్నాడు.
ఆటోలో వెళ్తుండగా, మార్గమధ్యలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆటోలోంచి డ్రైవర్ దించేశాడు. అక్కడ్నుంచి ఆమె మృతదేహాన్ని వేరే వాహనంలో తీసుకెళ్లేందుకు అతడి దగ్గర డబ్బులు లేవు. దీంతో భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని, నడుచుకుంటూ వెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు స్పందించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతోపాటు, స్థానికులు కలిసి కొంత డబ్బు సమకూర్చారు. ఆ డబ్బుతో అంబులెన్స్ మాట్లాడి, అందులో సాములును, అతడి భార్య మృతదేహాన్ని తరలించారు.







